ఆదివాసీలను విస్మరించిన నాగరికత
32ఆదివాసీలను విస్మరించిన నాగరికత
౼ అమలు చేయని రాజ్యాంగ హక్కులు
౼ ఆదీవాసీల మధ్య కరువైన ఐక్యత
౼ విభజించి పాలిస్తున్న పాలకులు
౼ ఆదివాసీ పోరాట త్యాగాలు కనుమరుగు
ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరిగింది . మీడియాను పరిశీలిస్తే ఈ దినోత్సవం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించ లేదు వినిపించలేదు . ఒకటి రెండు టివీ లలో ఆచారం ప్రకారం రెండు వాక్యాలు అర్పించారు తప్ప సీరియస్ చర్చలు లేవు . పండగ శుభాకాంక్షలు తెలిపినట్లు అక్కడొకరు ఇక్కడొకరు శుభాకాంక్షలు చెప్పడం తప్పితే , ఆదివాసి సమస్యల గురించి చర్చించినవారు పరిష్కారాలు సూచించిన వారు తక్కువే .
౼ పట్టించుకోని నాగరిక సమాజం
వామపక్షాలకు చెందిన వారు కూడా ఒకటి రెండు ఆదివాసి గ్రామాలలో ఆదివాసి దినోత్సవాన్ని జరుపుకున్నారు . కానీ ఆ పార్టీలు ఈ దినోత్సవాన్ని మొత్తం పార్టీ కార్యక్రమంగా జరపలేదు . ఆదివాసి సమస్య , ఆదివాసి ప్రజలకు సంభంధించిన సమస్య మాత్రమేనా ? అది భారతదేశ సమస్య కాదా ? వామపక్షాలు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం , అంతర్జాతీయ మహిళా దినోత్సవం కు ఇచ్చిన ప్రాధాన్యతలో సగం కూడా , అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవానికి ఇవ్వలేదు . ఈ దేశంలో సుదీర్ఘ కాలం నుండి ఆదివాసుల లో పనిచేస్తూ పోరాడుతున్న వామపక్షాలు , ఆదివాసి దినోత్సవానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా ? ఆదివాసి సంఘాలు కూడా ఈ దినోత్సవాన్ని ప్రధానంగా పండుగ లాగా జరుపుకున్నాయే కానీ ఈ రోజును స్ఫూర్తిగా తీసుకుని తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాడాలని శపథం చేసే దినంగా జరపలేకపోయారు . ఏది ఏమైనా ఈ దినోత్సవ సందర్భంగా కూడా భారత దేశ ఆదివాసులు రెండో స్థాయి పౌరులు మాత్రమే అని మరోసారి నిరూపించింది “నాగరిక” సమాజం . వజ్రోత్సవాల కోలాహలంలో , అట్టహాసంలో ఆదివాసీల గురించి దేశ నాయకులు మరిచిపోయారు .
౼ త్యాగాల చరిత్ర కనుమరుగు
స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారు , పాల్గొనని వారు కూడా వజ్రోత్సవాల పేరుతో ఎన్నికల లబ్ధి ఎంత పొందవచ్చు అని మాత్రమే పోటి పడుతున్నారు . విచిత్రం ఏమిటంటే భారతదేశం మీద ఏ విదేశీయులు దాడి చేసినా మొట్టమొదట తిరుగుబాటు జెండా ఎగురవేసింది స్వేచ్ఛా ప్రియులైన ఆదివాసులే . భారతదేశ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఆదివాసుల పోరాటాల చరిత్రను విస్మరించి నట్లుగనే ఇప్పుడు కూడా మొత్తం ఆదివాసులనే విస్మరిస్తున్నారు .
౼ ఉత్సవాలను పట్టించుకోని పాలకులు
ఐక్య రాజ్య సమితి 1994 నుండి ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని , ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రకటించింది . 1995 నుండి ఐక్యరాజ్య సమితి నాయకత్వంలో ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని జరుపుకుంటు వస్తున్నారు . మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలలో దాదాపు 48 కోట్ల మంది ఆదివాసులు ఉన్నారని అంచనా . వారు ప్రపంచ జనాభాలో 5 శాతం కంటే తక్కువనే . కానీ పేదలలో 15 శాతం ఉన్నారు . మొత్తం ప్రపంచంలో ఉన్న 7000 భాషలలో ఎక్కువ భాషలు మాట్లాడుతారు . 5000 విభిన్న సంస్కృతులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు . అయితే ఇవన్నీ ఐక్యరాజ్య సమితికి చెందిన సంస్థలు మొత్తం ప్రపంచం గురించి ఇచ్చిన అంచనాలు మాత్రమే . పేదరికం ఇంకా ఎక్కువగనే ఉంటుంది . సాంప్రదయక జ్ఞానాన్ని రక్షించడంలోనూ ప్రసారం చేయడంలోనూ ఆదివాసీ మహిళల పాత్ర ఈ సంవత్సర ఆదివాసీ దినం యొక్క విషయం . ప్రతి సంవత్సరం ఆదివాసులకు చెందిన ఏదో ఒక విషయాన్ని చర్చించడానికి ఎంచుకుని ప్రపంచ ఆదీవాసీ దినోత్సవాన్ని జరుపుతూనే ఉన్నారు . మరో వైపు ఆదివాసుల పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు దిగజారుతూనే ఉన్నది .
౼ ఆదివాసీల పరిస్థితి అధ్వాన్నం
మన దేశ విషయానికి వస్తే ఆదీవాసుల పరిస్థితులు మరింత ఘోరంగా ఉన్నాయి . భారతదేశ జనాభాలో ఆదివాసులు దాదాపు 9 శాతం ఉంటే , అందులో 40 శాతం పేదరికంలోనే ఉన్నారని ఒక అంచనా . ఈ పరిస్థితిని సరిదిద్దాల్సింది పోయి ఇప్పుడు కేంద్రంలో అధికారం కలిగి ఉన్న పార్టీ , అసలు ఆదివాసులను , ఆదివాసులుగానే గుర్తించని ఆలోచనతో ఉన్నది . ఆదివాసులను , అడవులలో ఉంటున్న హిందువులే అని చెప్పుతూ వారిని వనవాసులు అని పిలుస్తున్నది . ఇప్పటికే జనభా లెక్కింపు సందర్భంగా చాలా రాష్ట్రాలలో తెలిసీ తెలవక , స్పష్టమైన కోడ్ లెకపోవడం వలన ఆదీవాసులను , హిందువులుగా లెక్కిస్తున్నారు . దీనితో ఆదివాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతలు కూడా 5th షెడ్యూల్ లోకి రాకుండా పోతున్నాయి . ఆదివాసులకు దక్కాల్సిన అవకాశాలు , హక్కులు , రక్షణలు దక్కకుండా పోతున్నాయి . 1871 నుండి 1951 వరకు జనభా లెక్కలలో స్పష్టంగా మతం కాలమ్ లో ఆదివాసులగా గుర్తించే కోడ్ ఉండింది . కానీ 1951 తరువాత జనాభా లెక్కలలో మతం కాలమ్ కింద ఉన్న ఆదివాసుల ఆప్షన్ తీసివేసి , “ఇతరులు” అని చేర్చడం జరిగింది . చివరికి 2011 వరకు ఉండిన “ఇతరులు” అనే ఆప్షన్ ను కూడా తీసివేశారు . మతం కాలమ్ లో ఆరు మతాలనే ఉంచారు . 1) హిందూ , 2) ముస్లిం , 3) క్రిస్టియన్ , 4) బౌద్ధులు , 5) జైనులు , 6) సిక్కులు . జనాభా లెక్కింపులలో ఇలా చేస్తూ వచ్చిన మార్పులతోనే ఆదివాసీల జనాభా తక్కువగా లెక్కించబడుతూ వస్తున్నది . అంటే భారత దేశ ఆదివాసులు అందరూ 6 మతాలలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలన్న మాట . విచిత్రం ఏమిటంటే బౌద్ధులు జైనులు కంటే మన దేశంలో ఆదివాసుల సంఖ్యనే ఎక్కువగా ఉన్నది . కానీ ఆదివాసులకు జనాభా లెక్కలలో తమ మతం గురించి , తమ విశ్వాసాలను గురించి ప్రకటించుకునే , గుర్తించే అవకాశమే ఇవ్వలేదు . ఆదివాసులందరిని హిందువులుగా లెక్కించే కుట్ర నే ఇది . అయితే 2019 లో 19 రాష్ట్రాలకు చెందిన ఆదివాసులు వారి ప్రతినిధులు , 2021 జనాభా లెక్కింపులో మతం కాలమ్ లో ఆదివాసులను గుర్తించే కోడ్ పెట్టాలని డిమాండు చేస్తూ డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేశారు . జార్ఖండ్ అసెంబ్లీ ఈ సందర్భంగానే , జనభా లెక్కింపులో ఆదివాసులను గుర్తించడానికి , ఆదివాసుల మతం అయిన సర్నాను మతం కాలమ్ లో పెట్టాలని తీర్మానం కూడా చేసింది . కేంద్ర ప్రభుత్వ అంగీకారం లేకుండా అది అమలు అయ్యే విషయం కాదు . కాని ఆదీవాసులను హిందువులగా మాత్రమే గుర్తించే BJP ప్రభుత్వం వాళ్ళను పట్టించుకోనే లేదు . ఇతర పార్టీలన్ని గట్టిగా కళ్ళు మూసుకుని మౌన వ్రతం పాటించాయి .
౼ మతముద్రకు కుతంత్రాలు
ఇక జరిగేదెమిటంటే , ఆదివాసులు అందరూ హిందువులే కావున వారి ప్రాంతాలకు ప్రత్యేక చట్టాలు ప్రత్యేక రక్షణలు , హక్కులు అవసరం లేదంటారు . ఇటువంటి రక్షణ చట్టాల వల్లనే ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి చెందడం లేదని ఇప్పటికే కొందరు వాదిస్తున్నారు . అందుకే తెలంగాణా ఆంధ్రాలో 1/70 చట్టాన్ని ఎత్తివేయాలని చర్చలు , వాదనలు కూడా చేస్తున్నారు . ఇక ఇప్పుడు అందరం హిందువులమే పేరు మీద ఇటువంటి చట్టలన్నింటిని తుంగలో తొక్కవచ్చు . అంబానీ అదానీ లకు ఆదివాసి ప్రాంతాలలోని ఖనిజాలను , ఇతర సంపదలను ఎటువంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా తరలించుకు పోవడానికి అవకాశం ఏర్పడుతుంది . ఆదివాసులను వారి ప్రాంతాలనుండి తరిమి వేయవచ్చు . ఇప్పటికే మన దేశంలో కట్టిన పెద్ద ప్రాజెక్టుల వలన గనుల వలన నిర్వాసితులు అయ్యింది 70 శాతం మంది ఆదివాసులే . యురేనియం లాంటి గనుల వలన అకాల మరణాలకు గురవుతున్నదీ , అంతుపట్టని రోగాలకు బలి అవుతున్నది ఆదివాసులే . ఒక ప్రణాళిక లేకుండా ఎటువంటి పర్యావరణ జాగ్రత్తలు తీసుకోకుండా చిత్తం వచ్చినట్లు గనుల తవ్వకాలు చేపడుతూ ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నారు . రోగాల పాలు చేస్తున్నారు . పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నారు . అటవీ చట్టాల లో పారిశ్రామిక అధిపతులకు అనుకూలంగా సవరణలు చేసి వేల ఎకరాల అడవులను నరికి వేయడానికి అనుమతులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం . ఇటువంటి చట్టాలు ఇంకా కొత్తవి చేయడానికి ప్రభుత్వం పూనుకుంటున్నది . ఇవన్నీ ఆదివాసుల అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తుండగా , అన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఆదివాసులు తమ అస్తిత్వం కొరకు రాజీలేని పోరాటం చేస్తున్నారు . అందుకే ఇప్పుడు వారి అస్తిత్వ పోరాటాలకు పునాదే లేకుండా చేయడం కొరకు , జనాభా లెక్కలలో ఆదివాసుల గుర్తింపు నే మాయం చేస్తున్నారు . ఇది వారి మొదటి అడుగు మాత్రమే .
౼ సంఘటితమే హక్కుల రక్షణకు మార్గం
ఆదివాసుల హక్కులను రక్షించడం , విద్య వైద్య సంస్కృతులను అభివృద్ధి చేయడం కొరకే ప్రపంచ ఆదివాసి దినోత్సవాలను జరుపుకుంటున్నట్లుగా ఐక్యరాజ్యసమితి చెప్పుకుంటున్నది . కానీ ముందే చెప్పినట్లు ఆదివాసులు నిర్వాసితులు అవుతుండగా వారి సంస్కృతి పై అన్ని దిక్కుల నుండి దాడి జరుగుతున్నది . ఆదివాసుల భాషల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి . ఇప్పటికే చాలా రాష్ట్రాలలో ఆదివాసులలో చాలామందికి వారి మాతృభాష రాకుండా పోయింది . ఏ రాష్ట్రంలో ఏ భాష అధికార భాషగా ఉంటే ఆ భాషను ఆ రాష్ట్రంలోని ఆదివాసుల పైన రుద్ద పడుతున్నది . చత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ లో ఆదివాసీలపై హిందీ రుద్ద పడుతున్నది . తెలుగు రాష్ట్రాలలో తెలుగు రుద్ద పడుతున్నది . ఒరిస్సాలో , ఒడియా రుద్ద పడుతున్నది . భారతదేశం అంతటా పరిస్థితి ఇదే విధంగా ఉన్నది . కనీసం 1980 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం లోనూ కొన్ని ఇతర రాష్ట్రాలలోనూ హిందీ లిపిలోనే అయినా , ఆదివాసులకు ప్రాథమిక విద్య వారి మాతృభాషలోనే బోధించబడింది . కానీ తరువాత అది కూడా ఎత్తివేశారు . ఇప్పటికే భారతదేశంలో ఎన్నో ఆదివాసుల భాషలు అంతరించి పోయాయి . మిగిలిన ఆదివాసి భాషలు కూడా అంతరించిపోయే పరిస్థితిలో ఉన్నాయి . విద్య , ఆరోగ్యం విషయంలో ఈ రోజుకు కూడా ఆదివాసీ ప్రాంతాలు వెనకపడే ఉన్నాయి . సులువుగా తగ్గించగలిగే మలేరియా వైద్యాన్ని కూడా సరిగా అందించపోవడం వలన ప్రతి యేడు ఆదివాసులు చనిపోతునే ఉన్నారు . ఇక , ఒక ప్రాంతంలో ఒకప్పుడు ఆదివాసులు ఉండే వారని గుర్తించడానికి కూడా వీలు లేకుండా వారి గుర్తులు అన్నింటినీ కూడా తుడిచివేయ చూస్తున్నారు . ప్రాంతాల పేర్లను గ్రామాల పేర్లను మనుషుల పేర్లను నదుల పేర్లను చివరికి కొండల పేర్లను అన్నింటినీ అన్నింటిని మార్చి వేస్తున్నారు . మరో వైపు ఆదివాసుల మతం మార్చడానికి వివిధ మత సంస్థలు , ముఖ్యంగా క్రైస్తవ , హిందూ సంస్థలు పోటీ పడి పని చేస్తున్నాయి . చివరికి ఈ మత సంస్థలు ఆదివాసులను కులాలుగా చీల్చుతున్నాయి . ఏ కులంలోకి మతంలోకి వెల్లని ఆదివాసులను అంటరానివారుగా చూస్తున్నారు , మారుస్తున్నారు . మొత్తంగా ఆదివాసీ సమాజాన్ని ధ్వసం చేయడానికి కార్పోరేట్ వర్గాలు , పాలకవర్గాలు , పార్టీలకు అతీతంగా ఒక్కటై పని చేస్తున్నాయి . ఆదీవాసి సమాజం కూడా పార్టీలకు , మతాలకు అతీతంగా ఐక్యం అయ్యి తమ అస్తిత్వం కొరకు ఒక్కటిగా పోరాడాల్సి ఉంది . అప్పుడే ఆదివాసి సమాజం తన అస్తిత్వాన్ని కాపాడుకో గలుగుతుంది .
**లంకా పాపిరెడ్డి
8465053792