గు‘లాబీ’ పోరులో నిలకడెంత!?
– కమలం పై గులాబీ కన్నెర!
– టీఆర్ఎస్లో మార్పు నిజమా?
– రాష్ట్రంలో తిరిగి అధికారమా?
– రాజకీయాల్లో ఆదర్శమా?
– కేసీఆర్ తీరుపై పలు సందేహాలు
వేకువ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర రాజకీయాల్లో గత ఎనిమిదేళ్ళ కాలం ఒక ఎత్తైతే...ఎనిమిదినెలల కాల రాజకీయం మరోఎత్తుగా సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరుధ్యంగా ఈ ఎనిమిదేళ్ళకాలం కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయ వేదికపై టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే తీరుగా మారిపోయింది. కేంద్రంలోని బీజేపీ విధానంలో పెద్దగా వచ్చిన మార్పేమీ లేకపోయినప్పటికీ ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ విధానంలో వచ్చిన మార్పుగా చెప్పవచ్చు. గులాబీ బాస్లో వచ్చిన ఈ తాజా మార్పు ఇలాగే కొనసాగుతుందా? లేక మూడవ పర్యాయం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఆడుతున్న రాజకీయ డ్రామాలా? అనే అనుమానాలున్నాయి. బీజేపీ వ్యతిరేక వైఖరితో కేసీఆర్ నిలకడతో ఉంటారా? అధికారం కాపాడుకునేందుకు అవకాశవాద విధానాలు అవలంభిస్తారా? అనే ప్రశ్నలు అందరిలో ముప్పిరిగొంటున్నాయి.
– బీజేపీపై పోరులో టీఆర్ఎస్ నిలకడెంత?
ఎందుకంటే ప్రాంతీయ పార్టీగా, ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే తాను అంత నిలకడగా ఉంటాడనేదానికి గ్యారంటీ లేదు. కేసీఆర్ ఏకపక్షంగా ఎంత దాడి చేయగలరో? అంతే స్థాయిలో ఎదుటి పార్టీతో మిలాఖత్ కావడానికి దోస్తీ చేయడానికి వెనుకంజ వేయరనేది జగమెరిగిన సత్యం. అందుకే గత ఎనిమిది నెలలుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేది తమతమ స్వార్ధ రాజకీయాల కోసమా? రాష్ట్రాభివృద్ధి ఆశించి, సమాజ ప్రయోజనాలలో భాగంగా మత తత్వానికీ, ఆ రాజకీయాలకు వ్యతిరేకంగా చేస్తున్న ‘పోరాటమా’ అనే సందేహాలు ఉన్నాయి. కొద్ది కాలంలోనే ఇవన్నీ తేలిపోతాయి.
– ఎనిమిదేళ్ళుగా గులాబీ, కమలం దోస్తీ
ఎనిమిదేళ్ళ కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సయోధ్య కొనసాగింది. కానీ, ఇటీవల కేసీఆర్లో వచ్చిన తేడాను గుర్తించి తాజా రాజకీయాలను విశ్లేషించుకుంటే అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావనంతరం మూడవ దఫా సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు చేరుకుంటున్నాం. ఇప్పటి వరకు సాగిన ఈ ఎనిమిదేళ్ళకాలంలో టీఆర్ఎస్ తన అధికారాన్ని కొనసాగిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ తన గుర్తింపును కాపాడుకుంటూ వస్తోంది. రాష్ట్రం విడిపోయినా మూడవ స్థానంలో టీడీపీ కొనసాగుతూ వచ్చినప్పటికీ ఆ పార్టీ ఉనికిని సహించలేని అధికార పక్షం ఆ ఎమ్మెల్యేలను వశపరచుకోవడంలో సక్సెస్ అయ్యింది. తదుపరి ఎంఐఎం, ఆ తర్వాత స్థానంలో బీజేపీ ఉందనేది వాస్తవం. అసెంబ్లీ బలాబలాల రీత్యా చూస్తే ఇవన్నీ మన కళ్ళ ముందున్న వాస్తవాలు. ఇక ఈ ఎనిమిదేళ్లకాలంలో కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ మెజార్టీ ప్రభుత్వం కొనసాగుతోంది. అక్కడ బలం, బలగం తగ్గినా ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయినా రెండవ స్థానం కాంగ్రెస్కే దక్కింది.
– మోడీ పాలసీలకు కేసీఆర్ మద్ధతు
ఈ ఎనిమిదేళ్ళ కాలంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్టీఏ పక్షాలకంటే మిన్నగా, బీజేపీ నాయకులకంటే ఎక్కువగా మోడీని, కేంద్ర ప్రభుత్వ విధానాలను బహిరంగంగా సమర్ధించడంలో కేసీఆర్ ముందున్నారు. డీమానిటైజేషేషన్ నుంచి ఆర్ధిక సంస్కరణలకు సంఘీభావం అందిస్తూ వచ్చారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ ముందు మాట్లాడిన కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి మోడీని కలువగానే మాటమార్చారు.
– కమలం పైన గులాబీ కన్నెర్ర
ఇటీవల మోడీ రైతు వ్యతిరేక విధానాలపై ప్లేట్ ఫిరాయించి సీఎం స్థాయిలో ప్రత్యక్షంగా ధర్నా చేశారు. హైదరాబాద్, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల తర్వాత వరి సాగుతో మొదలైన వివాదం ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తోంది. విభజన హామీలు, మళ్ళీ ధాన్యం కొనుగోళ్ళను ముందుకు తెచ్చారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీగా కేంద్రంపై గులాబీ శ్రేణులను మోహరిస్తోంది. హిజాబ్ లాంటి అంశాలను లేవనెత్తి మతపిచ్చి అంటూ తీవ్రంగా విమర్శించారు. ప్రధాని హోదాలో మోడీ రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకకుండా ఆరోగ్యం పేరుతో దూరంగా ఉన్నారు. లౌకిక విధానాలను ఏకరువుపెడుతున్నారు. యాదగిరి గుట్ట పున:ప్రారంభానికి మోడీని దూరం పెట్టారు. కేంద్రం తాజా అన్ని విధానాలపై తీవ్రంగా విరుచుకపడుతున్నారు. కేసీఆర్ విమర్శల్లో నిజం లేకపోలేదు. కానీ, ఇంతకాలం కిమ్మనకుండా ఉండి, పైగా మద్ధతుతెలిపిన కేసీఆర్ ఆకస్మికంగా ఈ వ్యతిరేక లైన్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత ఎనిమిది నెలలుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉప్పూనిప్పూ అనే తీరుగా సాగుతోంది. ఈ విధానాలపై రాజకీయ నిబద్ధతతో కేసీఆర్ దీర్ఘకాలం బీజేపీ, కేంద్రానికి వ్యతిరేకంగా నిలబడుతారా? లేదా? అనేది భవిష్యత్లో మాత్రమే తేలనున్నది. ఎన్నిచెప్పినా కేసీఆర్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నిలకడగా ఉండే వ్యక్తిమాత్రం కాదంటూ గత అనుభవాలను కొందరు గుర్తు చేస్తున్నారు.