రైల్వే పరిశ్రమలపై రాజకీయ ఎ ‘జెండా’..
రైల్వే పరిశ్రమలపై రాజకీయ ఎ ‘జెండా’!!
– ఎన్నికల ప్రయోజనమే ఎకైక లక్ష్యం
– కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై నిర్లక్ష్యం
– అభివృద్ధి పట్ల అధికార పక్షాల జాప్యం
వేకువ ప్రత్యేక ప్రతినిధి:
ఉత్తర, దక్షిణ భారతానికి గేట్వేగా ఉన్న కాజీపేటలో రైల్వేపరిశ్రమల ఏర్పాటు పై ఏండ్లు గడుస్తున్నా అవసరమైన శ్రద్ధ పెట్టాలనేది మరిచిపోయిన అధికార పార్టీలకు ఎన్నికల ప్రయోజనముంటేనే ఎజెండా పైకి తీసుకరావడం చర్వితచరణంగా మారింది. రాజకీయ అవసరం పడితేనే ఈ పార్టీల నాయకులకు కోచ్ ఫ్యాక్టరీ యాదికొస్తున్నది. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం చిరకాల ప్రజాకాంక్షను అనుకూలంగా మలుచుకుంటున్నారు. పోరాటం ద్వారా ఈ సమస్య పరిష్కారమైతుందని భావించి ఉద్యమాలకు సిద్ధంగా ఉండే కమ్యూనిస్టు పార్టీలు, సంఘాలు సహజంగానే వీరి వలలో తెలిసిమరీ చిక్కుకుంటున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా విభజన చట్టంలో ఇచ్చిన కోచ్ ఫ్యాక్టరీ హామీ రాజకీయ పార్టీల ఆధిపత్య ఆటకు కేంద్రంగా ఉపయోగపడుతున్నది. ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉండగా ‘ఇచ్చే స్థానంలో ఉండి ఇవ్వకుండా కొర్రీలు పెడుతూ మొండి చేయి’ చూపెట్టడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవహరిస్తున్నారు. అవసరమొచ్చినప్పుడల్లా ఈ కోచ్ ఫ్యాక్టరీ పై పరస్పరం విమర్శలు చేసుకోవడం, ఒకరిపై మరొకరు నెపం పెట్టుకొని కాలాయాపన చేయడం తప్ప అడుగు ముందుకు పడిందీ లేదు. ఆశతో ఉన్న నిరుద్యోగులకు ఒక్క నౌకరీ కల్పించిందీలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి నేడు గురువారం కాజీపేటలో ఐక్యపోరాటానికి సిద్ధమైతూ సిపిఐ, సిపిఎం, ఇతర కార్మిక, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 11 గంటలకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికోసం ఇప్పటికే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, చీప్విప్ దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో రంగం సిద్ధం చేసుకొని సీపీఐ, సీపీఎం నాయకులను స్వయంగా కలిసి మాట్లాడారు.
– రాజకీయ ఎ‘జెండా’గా మారిన కోచ్ ఫ్యాక్టరీ
దశాబ్దంన్నర కాలంగా కోచ్ ఫ్యాక్టరీ రాజకీయ ఎజెండాగా మారిపోయింది. కేంద్రంలోని బీజేపీతో టీఆర్ఎస్ అంటకాగినంత సేవు ఈ విషయాన్ని మరుగుపరచడం అలవాటైంది. 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని అడుగులు ముందుకు వేసి సఫలీకృతమైంది. కానీ, 2018లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు అనుకూలంగా ప్రజలను మభ్యపెట్టేందుకు విభజన హామీలు, కోచ్ ఫ్యాక్టరీని ఎజెండా చేసి కాజీపేట కేంద్రంగా పోరాటాన్ని ఎక్కుపెట్టారు. బీజేపీ పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ పోరాటం చేపట్టామని ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత షరా మాములుగా ప్రాధాన్యత మారిపోయి పోరాటం నీరుగారి పోయింది. ఇటీవల వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు మరోసారి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రం చేశారు. ఢిల్లీ స్థాయిలో ఉద్యమాన్ని కేంద్రీకృతం చేసి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను భాగస్వామ్యం చేస్తూ బీజేపీపై ఒత్తిడి తేవాలని నిర్ణయించి ఒక దశలో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని రూపొందించి ఆఖరి నిమిషంలో వెనుకంజ వేసి ఉద్యమాన్ని చల్లార్చారు.
– అధికారం ఆటలో పావు
తాజాగా రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అధికార జూదానికి ఆరాటం పెరిగిన నేపథ్యంలో మరోసారి ‘కోచ్’ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చి బీజేపీని ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో మంత్రులు, చీప్విప్ వినయ్, ఎమ్మెల్యే నన్నపునేని తదితరులు బీజేపీపై విమర్శలు పెంచారు. దీనికి కౌంటర్గా కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లు టీఆర్ఎస్ భూమి కేటాయించకుండా జాప్యం చేస్తుందంటూ ప్రతివిమర్శ చేశారు. రెండు పార్టీల రాజకీయ క్రీడలో కోచ్ ఫ్యాక్టరీ, స్థానిక ప్రజల ఆశలు గల్లంతైతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి పోరాటానికి సిద్ధమైతున్న ఈ తరుణంలో రెండు బీజేపీ, టీఆర్ఎస్ పై ఒత్తిడి తెస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోవాలనే అభిప్రాయం వ్యక్తమైతుంది. లేకుంటే తమ ప్రయోజనం నెరవేరగానే కాడెత్తేయడం ఈ పార్టీల నేతలకు అలవాటైందంటున్నారు. అందుకే అప్రమత్తతతో వ్యవహరించాలని ఇతర పక్షాలకు సూచిస్తున్నారు. నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న రాజకీయ పక్షాలు, సంఘాలు మరో ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరుతున్నారు.
– నీరుగారి పోతున్న నిరుద్యోగుల ఆశ
దాదాపు రెండు దశాబ్దాలుగా కాజీపేట కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీ రైల్వే పరిశ్రమ ఏర్పాటు చేస్తే స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తూ వచ్చారు. ఈ మేరకు తొలి దశలో ప్రొఫెల్లెంట్ ఫ్యాక్టరీ, తర్వాత కోచ్ ఫ్యాక్టరీ, ఓవరాయిలింగ్ బ్రాంచ్, రైల్వే ఛక్రాల పరిశ్రమ ఏర్పాటు తదితర అనేక పరిశ్రమలను వివిధ రూపాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు తెచ్చారు. స్థానికుల్లో ఆశలు కల్పించారు. ఏ ఒక్క ఆశ ఇప్పటి వరకు నెరవేర్చకపోవడం గమనార్హం. వరంగల్ జిల్లా కేంద్రంలో భాగంగా ఉన్న కాజీపేట పట్టణంతో పాటు కార్పొరేషన్లో భాగమైన సోమిడి, టేకులగూడెం, మడికొండ,రాంపూర్, తరాలపల్లి, బట్టు పల్లి,కడిపికొండ తదితర గ్రామలను కలుపుకుంటే లక్ష జనాభా ఉంది. కాజీపేటలో రైల్వే కోచ్ ప్యాక్టరీ వస్తే ఈ ప్రాంత ప్రజల జీవితాలు బాగుపడుతాయని గంపెడాశపెట్టుకున్నారు. ప్రత్యక్షంగా 60 వేల ఉద్యోగాలలో స్థానికులకు 10 వేల ఉద్యోగాలు లభిస్తాయని భావించారు. అన్ని వర్గాలు స్టేషన్లో పూలు,కూరగాయలు అమ్మే కూలి తల్లి నుండి సాధారణ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుందనుకున్నారు. కానీ, కోచ్ ప్యాక్టరీ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ల దొంగాట స్థానికులకు శాపంగా మారింది.
– ఆదాయమున్నా అభివృద్ధి శూన్యం
దక్షిణ మధ్య రైల్వేలో ఆరు డివిజన్లుండగా కాజీపేట డివిజన్ నుంచే 46.8శాతం ఆదాయం సమకూరుతున్నది. ఇతర డివిజన్ల అన్నింటికంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు సుమారు 1,20వేల మంది, రిటైర్డ్ ఉద్యోగులు 8వేల కుటుంబాలు ఉన్నాయి. అధికారికంగా మూడు జంక్షన్లు పెద్దపల్లి, డోర్నకల్, కారేపల్లి అనధికారికంగా మానిగర్, జగయ్యపేట జంక్షన్లున్నాయి. మొత్తం స్టేషన్లు 83 ఉన్నాయి. ఈ డివిజన్లో హైదరాబాద్ రైల్వే మార్గంలో పెంబర్తి స్టేషన్ వరకు, విజయవాడ మార్గంలో కొండపల్లి స్టేషన్వరకు, భద్రాచలం మార్గంలో మణుగూరు, ఢిల్లీలో మార్గంలో మానిఘర్ స్టేషన్ వరకు, ఫండరీపాణి, ఘట్చందూర్ వరకు, లింగంపేట, జగిత్యాల స్టేషన్ల వరకు పరిధి ఉండేలా డివిజన్ ఏర్పాటు చేసేందుకు అవకాశం
– బీజేపీ, టిఆర్ఎస్ పార్టీల నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రైల్వే పరంగా తీవ్ర అన్యాయం చేస్తున్నారు. స్టేషన్లలో కనీస శానిటేషన్, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. అదనపు ప్లాట్ ఫారమ్ల నిర్మాణమే లేదు.
– కాజీపేట కు మంజూరైనటువంటి వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ రూ.480 కోట్ల మంజూరైనా నిధులు విడుదల కాలేదు.
– కాజీపేట టౌన్ స్టేషన్ లో 2, 3 వ ప్లాట్ఫారమ్లను ఏర్పాటు చేసి బల్లార్ష నుండి వరంగల్ వైపు - వెళ్ళే రైళ్లను టౌన్ స్టేషన్ లో ఆపి నీటి వసతి కల్పించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.
– విభజన చట్టంలో పేర్కొన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వందే భారత్ కోచ్ ఫ్యాక్టరీగా కాజీపేటలో నెలకొల్పాలని, రైల్వే డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
– రైల్వే కార్మికుల కోసం వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర రెండు పడకల గదితో రైల్వే క్వార్టర్స్ నిర్మాణం చేపట్టాలని, మెయిన్ రోడ్ లో ఉన్న రైల్వే స్థలాలలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసే నిరుద్యోగులైన రైల్వే కుటుంబ పిల్లలకు కేటాయించాలని ఇక్కడి ప్రజల డిమాండు చేస్తున్నారు.
– సబ్ డివిజనల్ రైల్వే హాస్పిటల్ పనులను ప్రారంభించాలని కోరుతున్నారు.
– టీఆర్ఎస్కు కాజీపేట పై ప్రేమ ఉంటే మెట్రో కోచ్ ప్యాక్టరీని వికారాబాద్కు ఎందుకు తరలించారనే విమర్శలున్నాయి.
– -కోచ్ సాధనకు కొట్లాడుతాం: కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి
కోచ్ ప్యాక్టరీ ఏర్పాటు కోసం కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేసి ఈ కాజీపేట ప్రజల కానుకగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. రైల్వే స్టేడియం చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. దీని కోసం పోరాటం చేస్తాం
– కేంద్రం పై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధం: సీపీఐ నేత తక్కెళ్ళపల్లి
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉంది. కేంద్రంలోని బీజేపీ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తక్షణం చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన తగిన సహకారం అందించాలని కోరుతున్నారు. విభజన హామీలను కూడా సాధించుకోకపోతే నష్టం వాటిల్లుతుందన్నారు.
– ప్రజా పోరాటం ద్వారానే ఫలితం
రాజకీయ పార్టీలతో పాటు, ఉద్యమ సంఘాలు, సంస్థలు, విద్యార్ధి, యువతను కలుపుకొని సమైక్య పోరాటం ద్వారానే కేంద్రంలోని బీజేపీ పైన ఒత్తిడి తీసుకరావచ్చనే అభిప్రాయం వ్యక్తమైతున్నది. టీఆర్ఎస్ సైతం రాష్టంలో ఉన్న అధికార పార్టీగా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతున్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో ఒత్తిడి తీసుకొస్తే ఇప్పుడు కాకున్నా వచ్చే ఎన్నికల నాటికైనా కాజీపేటలో రైల్వే పరిశ్రమల ఏర్పాటు, పురోభివృద్ధికి బీజం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమైతున్నది.